Tuesday, 25 July 2017

డ్రాగన్ లెటెస్ట్ ఫోకస్

నమస్తే...
ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్ కు స్వాగతం...

( ) భారత్, చైనా మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. భారత్ ను దారిలోకి తెచ్చుకునేందుకు చైనా శతధా ప్రయత్నిస్తుంటే... ఆ దేశ మీడియా భారత్ పై విషం చిమ్ముతోంది. అదే సమయంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డోక్లామ్ నుంచి చైనా బలగాలను వెనక్కి వెళ్లేవరకు భారత్ బలగాలు వెనక్కి వెళ్లవని డ్రాగన్ కు భారత్ తేల్చి చెప్పింది. మొత్తం వ్యవహారాన్ని ఇరుదేశాలు పరిష్కరించుకోవాలంటూ అమెరికా హితవు పలుకుతోంది. గురువారం నుంచి జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సులో డోక్లామ్ పై రెండు దేశాలు చర్చించుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే తప్పు చేస్తోంది తనైనాప్పటికీ చైనా మాత్రం వెనక్కితగ్గడం లేదు. అదే సమయంలో ఎంత వరకైనా అంటూ భారత్ సై అంటోంది. చైనాతో సమానంగా భారత్ బలగాలు లేనప్పటికీ... చైనాను ఢీకొట్టే సత్తా ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. కయ్యానికి డ్రాగన్ కాలు దువ్వుతుంటే చూస్తూ ఊర్కోమన్న సంకేతాలను భారత్ ఇస్తోంది. చైనాతో సమరానికి సై అంటోంది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చైనా, భారత్ బలగాల లెక్కలేంటి? యుద్ధ సన్నాహాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్

స్టోరీ 1
ఓవైపు ఆర్థిక శక్తి. మరోవైపు బలమైన సైన్యం. అణ్వాయుధ సంపత్తి. ఇలా చైనా ఆసియాలో తనను  మించినవారు మరొకరు ఉండకూడదన్న పద్ధతిలో సైన్యాన్ని ఆధునీకరిస్తూ ముందుకు సాగుతోంది. అయితే భారత్ కూడా తక్కువేమీ కాదు. చైనా అంత సైనిక సంపత్తి, అణ్వాయుధ సంపత్తి భారత్ వద్ద లేకపోయినా... భారత్ తనను రక్షించేందుకు సైన్యాన్ని, అణ్వస్త్రాలను సిద్ధం చేసుకొంది. రెండు దేశాల మధ్య సైనిక సంపత్తి బలాబలాలను ఓ సారి తెలుసుకుందా.
వాయిస్
డోక్లామ్‌ ప్రాంతంలో భారత్‌, చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన.. రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని పెంచుతోంది. భారత్ భద్రతకు ముప్పు కలిగించేలా చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత సైన్యం గట్టిగా అడ్డుకోవడంతో వివాదం రాజుకొంది. చైనా డొక్లామ్ నుంచి వెనుతిరేగేవరకు అక్కడ్నుంచి కదలకూడదని భారత్ భీష్మించుకొంది. నేరుగా భారత్ పై కాలుదువ్వని చైనా... ఆ దేశ మీడియా ద్వారా రోజుకో విధంగా గాండ్రిస్తూనే ఉంది. 1962లో రెండు దేశాల నడుమ జరిగిన యుద్ధంలో భారత్‌పై పైచేయి  సాధించామంటూ గూర్తుచేస్తోంది. అయితే అప్పటి భారత్ కు నేటి భారత్ కు ఎంతో తేడా ఉందని భారత్ చైనాకు గట్టి బదులే ఇచ్చింది. భారత్ డొక్లామ్ నుంచి వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదంటూ హెచ్చరిస్తోంది.
వాయిస్
ఓవైపు దుష్ట పాకిస్తాన్ మరోవైపు కపట చైనా రెండు వైపుల నుంచి భారత్ ను ఇరుకునపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. భారత్ పై ఉన్న ద్వేషానికి పాకిస్తాన్ కశ్మీర్ లోని కొంత భాగాన్ని సమర్పయామి కూడా చేసుకొంది. తన వల్ల కాదని... అందుకు చైనా కరెక్ట్ అంటూ భారత్ పైకి ఎగదోస్తోంది. అయితే చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ చాకచక్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. చైనా అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ కు బదిలీ చేస్తుందన్న విషయం ప్రపంచానికి మొత్తం తెలిసిన విషయమే. ఓవైపు తీవ్రవాదంతో భారత్ లో చిచ్చు రాజేస్తున్న పాకిస్తాన్... చుట్టూ ఉన్న దేశాల భూభాగాలను కబలించేందుకు ఆబాగా చూస్తున్న చైనాతో ప్రమాదం పొంచి ఉంది. దశాబ్దాలుగా జోరుగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న చైనా.. తన వనరుల్లో గణనీయమైన భాగాన్ని సైనిక విస్తరణకు, ఆధునికీకరణకు కేటాయిస్తోంది. భారీగా సైనిక శక్తిని పెంచుకుంటోంది. ఒకప్పుడు భారత్‌, చైనాల సైనిక సామర్థ్యాల్లో వైరుద్ధ్యం ఒక మోస్తరుస్థాయిలో ఉండేది. ఇప్పుడు అది బాగా పెరిగింది. ఆలస్యంగా మేల్కొన్న భారత్‌ కూడా సైనిక ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఏటేటా తన పాటవాన్ని పెంచుకుంటోంది.
వాయిస్
ఓవైపు చైనా కాలుదువ్వుతుంటే... మరోవైపు భారత్ వైపు పాకిస్తాన్ ను రెచ్చగొట్టాలన్న కుట్ర కూడా డ్రాగన్ మదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్వాదర్‌ రేవు నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా చైనాలోకి ‘సీపెక్‌’ పేరిట ఒక ఎకనామిక్ కారిడార్ ను నిర్మించడాన్ని కూడా భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌.. ఏకకాలంలో రెండు దేశాల సైన్యాలతో తలపడాల్సిన  ప్రమాదం ఉందన్న సంకేతాలను రక్షణ నిపుణులు వివరిస్తున్నారు.  చైనా చాన్నాళ్ల నుంచే సైన్యం ఆధునీకీకరణ చేపట్టింది. చుట్టు ఉన్న దేశాలను నయానో భయానో తమదారిలోకి తెచ్చుకోవాలన్న కుట్రతో డ్రాగన్ భారీగా బడ్జెట్ లను రక్షణ కోసం కేటాయించింది. అదే సమయంలో భారత్ ఎంతగా ఆధునీకీకరణవైపు అడుగులు వేస్తున్నా... అవి అంతంత మాత్రంగానే ఉన్నాయ్. బోఫోర్స్‌ కుంభకోణం దరిమిలా... 30 ఏళ్లపాటు శతఘ్నుల కొనుగోళ్ల ప్రక్రియకు విఘాతం కలిగింది. అయితే మోదీ సర్కారు ఏలుబడిలో భారత్ అమెరికా నుంచి M777 శతఘ్నులు సైన్యానికి అందుబాటులోకి వచ్చా్య్.
వాయిస్
ఆధునిక యుద్ధంలో వైమానిక దళానిది చాలా కీలక పాత్ర. శత్రు స్థావరాలపై భారీగా మెరుపు దాడులు చేయడానికి, శత్రు యుద్ధవిమానాలతో ముఖాముఖీ తలపడి కూల్చడానికి, నిఘా వేయడానికి, సహాయ చర్యలకు, ప్రత్యేక బలగాలను శత్రు స్థావరాల వద్ద సిబ్బందిని జారవిడవడం ద్వారా వాయు శక్తి ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ధ ఫలితాన్ని ఎయిర్ ఫోర్స్ పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. భారత వైమానిక దళం.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దది. గగనతలంపై ఆధిపత్యాన్ని సమకూర్చిపెట్టే సుఖోయ్‌-30MKI  వంటి యుద్ధవిమానాలు భారత్ వద్ద  ఉన్నాయి. మరింత అధునాతనమైన రాఫేల్‌ యుద్ధవిమానాలు త్వరలో మన అమ్ములపొదిలో చేరబోతున్నాయి. భారత్ కు ఫైటర్ యుద్ధ విమానాలు 676 ఉండగా, చైనాకు 1271 ఉన్నాయ్. దాడి చేయగల సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు భారత్ వద్ద 809 ఉండగా, చైనా వద్ద 1385 ఉన్నాయ్. ఇక రవాణా చేయడానికి పనికివచ్చే విమానాలు 857 ఉండగా, చైనా వద్ద 782 ఉన్నాయ్. అదే సమయంలో శిక్షణ కోసం వినియోగించే విమానాలు భారత్ వద్ద 323 ఉండగా, చైనా వద్ద 352 సిద్ధంగా ఉన్నాయ్. భారత్ వద్ద సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాలు 2102. చైనాకు అందుబాటులో ఉన్నవి 2955. గాల్లో దాడి చేసే సామార్థ్యం ఉన్న హెలికాప్టర్లు 27 ఉన్నాయ్. చైనా వద్ద ఇలాంటివి 206 ఉన్నాయ్. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునేందుకు ఉపకరించే హెలికాప్టర్లు భారత్ వద్ద 666 ఉండగా, చైనా వద్ద 912 ఉన్నాయ్.
వాయిస్
భారత్‌కు 7516 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరం ఉంది. దీనికితోడు మన అంతర్జాతీయ వాణిజ్యం కూడా ఎక్కువ భాగం సముద్రం నుంచి సాగుతోంది. భారత్ ఆధీనంలో పలు దీవులు కూడా ఉన్నాయి. అందువల్ల సముద్రం నుంచి పొంచి ఉండే ముప్పుల నుంచి రక్షణ పొందడానికి, సాగరంలోని ప్రత్యేక ఆర్థిక మండలిని రక్షించుకోవడానికి సమర్థ నౌకాదళం మన చేతిలో ఉంది. ప్రస్తుతం భారత నౌకాదళం.. ప్రపంచంలోనే ఐదోస్థానంలో ఉంది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో నౌకాదళం కీలక పాత్ర పోషించింది. కరాచీ రేవుపై దాడి చేసి, పాక్‌ వెన్నులో దడ పుట్టించింది. హిందు మహా సముద్ర ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని అందించడంలో నౌకాదళానిదే కీలక పాత్ర. ఇక విమానవాహక నౌకలు భారత్, చైనా వద్ద ఒక్కటి మాత్రమే ఉన్నాయ్. ఇక జలంతర్గాములు...  ఫ్రిగేట్లు భారత్ వద్ద 14 ఉండగా, చైనా వద్ద 51 ఉన్నాయ్. విధ్వంసక నౌకలు ఇండియాలో 11 ఉంటే, డ్రాగన్ వద్ద 35 ఉన్నాయ్. చిన్న స్థాయి యుద్ధనౌకలు కార్వెట్లు భారత్ వద్ద 23 ఉండగా, చైనా వద్ద 35 ఉన్నాయ్. గస్తీ నౌకలు భారత్ చేతిలో 139 ఉండగా, చైనా వద్ద 220 వరకు ఉన్నాయ్. అణ్వాయుధాలు ఉపయోగించే సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు భారత్ వద్ద 2 ఉంటే, చైనా వద్ద 7 ఉన్నాయ్. సంప్రదాయ జలాంతర్గాముల విషయంలో చైనాదే పైచేయిగా ఉంది. భారత్ వద్ద 13 ఉంటే, అవి చైనా వద్ద 60 ఉన్నాయ్.
వాయిస్
భారత త్రివిధ దళాల్లో సైన్యానిదే వెన్నెముక. సంక్లిష్టమైన దేశ సరిహద్దులను రక్షించడంలోను, అంతర్గత భద్రతను రక్షించడంలోను పదాతి దళానిది కీలక పాత్ర.  ఇటీవల కాలంలో భారత సైన్యం రాటుదేలింది. ప్రపంచంలో మూడో పెద్ద సైనికశక్తిగా భారత్ నిలుస్తోంది. మన సైన్యంలో 35 డివిజన్లు, 13 కోర్‌లు ఉన్నాయి. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి 90 వేల మంది సైనికులతో పర్వత ప్రాంత దాడి దళాన్ని భారత్ సిద్ధం చేసింది. సైన్యం విషయంలోనూ డ్రాగన్ దే పైచేయి. భారత్ కు 13,25,000 సైన్య సంపత్తి ఉండగా, చైనా వద్ద 23,35,000 సంపత్తి ఉంది. రిజర్వ్ దళాలు భారత్ వద్ద 21,43,000. చైనా రిజర్వ్ దళాలు 23 లక్షలు. యుద్ధ ట్యాంకులు 4,426. చైనా యుద్ధ ట్యాంకులు 6457. సాయుధ పోరాటంలో కీలకమైన శకటాలు భారత్ వద్ద 6704 ఉంటే, చైనా వద్ద 4788 ఉన్నాయ్. రిమోట్ శతఘ్నులు భారత్ వద్ద 290 ఉంటే, చైనా వద్ద 1710 ఉన్నాయ్. వాహనానికి అనుసంధానించే శతఘ్నులు భారత్ వద్ద 7414 ఉండగా, చైనా వద్ద 6246 ఉన్నాయ్. రాకెట్ ను ప్రయోగించే వ్యవస్థలు భారత్ వద్ద 292 ఉంటే, చైనా వద్ద 1770 ఉన్నాయ్.
వాయిస్
ఆర్మ్స్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ అంచనా ప్రకారం భారత్‌ వద్ద 130 అణువార్‌హెడ్లు ఉన్నాయి. అణ్వాయుధ నిల్వల విషయంలో మన దేశం ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. నేల మీద సముద్రం మీద నుంచి, సాగరగర్భంలో నుంచి అణు వార్‌హెడ్లను చేరవేసే అనేక రకాల క్షిపణులు భారత్ అమ్ములపొదిలో ఉన్నాయి. దాదాపు 16వేల కిలోమీటర్ల పరిధి కలిగిన సూర్య అనే ఖండాంతర క్షిపణిని భారత్‌ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇక భారత్ వద్ద అణు వార్ హెడ్లు 130 ఉండగా, చైనా వద్ద 260 ఉన్నాయ్. క్రూయిజ్ క్షిపణులు 400 భారత్ శక్తికాగా, చైనా వద్ద అవి 3వేలు ఉన్నాయ్. బాలిస్టిక్ క్షిపణులు 5వేలు భారత్ అమ్ములపొదిలో ఉంటే... చైనా వద్ద 13 వేల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయ్.
వాయిస్
మొత్తంగా చైనా చాన్నాల్ల నుంచే సైన్యం ఆధునీకరణతో ఆసియాలో సూపర్ పవర్ గా ఎదగాలన్న కసితో అడుగులు ముందుకేస్తూ వచ్చింది. చైనా యుద్ధానికి కాలుదువ్వితే పరిస్థితి మరోలా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే యుద్ధం కేవలం సైనికుల మధ్య జరగదు. అన్ని రకాలుగా జరగడం ఖాయమనుకోవాలి. భారత్ పైకి పాకిస్తాన్ ను ఎగదోస్తున్న చైనా... భారత్ పై యుద్ధం విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయ్. భారత్ పై యుద్ధం చేసి గెలవడమంటే అది అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

స్టోరీ 2
భారత్ తో విశాలమైన సరిహద్దు కలిగిన చైనాకు డొక్లామ్ ప్రాంతం కొరకరాని కొయ్యలా మారింది. భూటాన్ మద్దతుతో డొక్లామ్ రక్షణ బాధ్యతలో దశాబ్దాల తరబడి భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చైనా మాత్రం డొక్లామ్ పై పట్టు కోసం రోడ్లు, మౌలిక వసతుల కల్పనంటూ కుట్రలు పన్నుతూనే ఉంది. మొన్నటి వరకు చైనా విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించని భారత్ మోదీ అధికారం చేపట్టాక క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. చైనా తగ్గ తగ్గంటూ హెచ్చరికలు పంపిస్తోంది.
వాయిస్
పాకిస్తాన్ విషయంలో చూసిచూడనట్టుగా భారత్ వ్యవహరించడానికి అనేక పరిస్థితులు కలిసి వస్తున్నాయ్. అదే సమయంలో చైనా విషయంలో భారత్ చూసీచూడనట్టుగా వ్యవహరించే వీలు అస్సలే లేదు. ఎందుకంటే డ్రాగన్ బూసలతో విషం చిమ్ముతుంది. అయినదానికీ కానిదానికి భారత్ ను శత్రుదేశంగా చూపిస్తూ విచ్చలవిడితనానికి పరాకాష్టగా వ్యవహరిస్తోంది. డొక్లామ్ ప్రాంతంలోకి చొరబడిందే కాక... అక్కడ్నుంచి భారత్ వెళ్లిపోవాలంటూ కుయుక్తులు పన్నుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఇంత వరకు గట్టిగా రియాక్ట్ అయిన దాఖలాలు అస్సలే కన్పించడం లేదు. విదేశాంగ కార్యదర్శి ఒక్కసారి మాట్లాడారు. రక్షణ మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ భారత్ పాత భారత్ కాదని సంకేతాలిచ్చారు. ఇవి చిన్నవేమీకానప్పటికీ... చైనా మీడియా దూకుడు, చైనా రక్షణ శాఖ అత్సుత్సాహం ఎక్కువవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పంథా మార్చుకోవాలి. దెబ్బకు దెబ్బ ఇక్కడ ప్రామాణికం కాకపోయినప్పటికీ... చైనా విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహాన్ని విదేశాంగ నిపుణులు గత రెండు నెలలుగా వివరిస్తూనే ఉన్నారు.
వాయిస్
డోక్‌లామ్‌ పీఠభూమిలో అక్రమంగా రహదారి నిర్మాణం చేపట్టిన చైనా ప్రయత్నాలను భారత్‌ గట్టిగా అడ్డుకుని నిలవడంతో సంక్షోభం మొదలైంది. వేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడూ సైనికపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయ్. 2010-17 మధ్య కాలంలో ఉభయ పక్షాల సరిహద్దుల్లో 2,500 చొరబాటు ఘటనలు జరిగాయి. వీటిలో చైనా నుంచి జరుగుతున్నవే అధికం. పాకిస్తాన్ భారత్ భూభాగంలో అడుపెట్టడానికి సహసించడం తక్కువనే చెప్పాలి. భారత్‌, భూటాన్‌, చైనాల మధ్య ఉన్న డోక్‌లామ్‌ ట్రైజంక్షన్‌ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంపై భూటాన్‌, చైనాల మధ్య వివాదం ఎప్పట్నుంచో కొనసాగుతోంది. భారత్‌కు భూటాన్‌తో సుదీర్ఘకాలంగా రక్షణ ఒప్పందం కొనసాగుతోంది. చైనాతో భారత్‌కు విశాలమైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రేఖ పొడవునా ఒక్క డోక్‌లామ్‌ ప్రాంతంలోనే భౌగోళికంగా చైనాకంటే బాగా భారత్‌ది పైచేయిగా ఉంది. ఈ ప్రాంతంలో భూటాన్‌, ఇండియాల మధ్య చైనా ఇరుక్కుపోయినట్టుగా కన్పిస్తుంది. ఈ ప్రాంతంలో చైనా పట్టు సాధిస్తే ఈశాన్య ప్రాంతాన్ని భారత్‌తో కలుపుతున్న ‘కోడి మెడ’ చికెన్‌ నెక్‌ పై పట్టుసాధించేందుకు బీజింగ్‌ దళాలకు అవకాశం దక్కుతుందన్న అభిప్రాయాన్ని రక్షణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. డోక్‌లామ్‌లో చైనా దళాలకు భారత్‌ గట్టిగా అడ్డుచెప్పడానికి అసలు కారణమిదే. జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు ప్రశంసించుకోవడంతో... డొక్లామ్ వద్ద ఉద్రిక్తత తగ్గుతుందని అందరూ భావించారు. చైనా ఎంతకు వెనక్కి తగ్గకపోవడం... భారత్ అదే పొజిషన్లో కొనసాగుతుండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ్.
వాయిస్
చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతోంది. గతంలోలా దిగుమతులు చేసుకునే పరిస్థితి నుంచి స్వయంసావలంబన దిశగా అడుగులు వేస్తోంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఉత్పత్తి మార్కెట్లో ప్రపంచదేశాలకు సవాల్ విసిరుతోంది. ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తుల వెల్లువెత్తుతోంది. దక్షిణ చైనా సముద్రంపైనా చైనా ఆధిపత్యం ప్రదర్శించాలని కపట నాటకాలను ఆడుకూనే ఉంది. వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు మధ్యధరా, హిందూ మహా సముద్రాల ద్వారానే సాగిస్తూ... ఆసియా దేశాలను పెద్దగా ఖాతరు చేయని పరిస్థితిలో చైనా కన్పిస్తోంది. 18 లక్షలకోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఐరోపా మార్కెట్లకు చేరవేస్తూ...  చైనా పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని సముపార్జిస్తుందని... విదేశీ వ్యవహారాల నిపుణులు మహేంద్రబాబు కురువ రాజ్ న్యూస్ కు వివరించారు. అదే సమయంలో భారత్ తో సహా పలు ఆసియా దేశాలు, రోడ్డు, రైలు మార్గాల ద్వారానూ ఎగుమతులను డ్రాగన్ చేస్తోంది. చైనాకు 18 దేశాలతో సరిహద్దు సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ నాయకత్వం మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తూ అమెరికా ఆగ్రహానికి గురవుతూనే ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ కు జమ్మూ, కాశ్మీర్ విషయంలోనూ, తీవ్రవాదం విషయంలోనూ సహకరిస్తూ... భారత్ పైకి పాక్ ఎగదోస్తోంది. భూటాన్‌ను భారత్ పైకి ఉసిగొల్పుతూ... ఆ దేశాన్ని మచ్చిక చేసుకునేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో రేవులు, రోడ్లు నిర్మాణాలంటూ ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించాలన్న రాజ్యకాంక్షతో రగిలిపోతోంది. తాము ఎవరి దాయదాక్షాణ్యలపై ఆధారపడాల్సిన పనిలేదన్న అతి విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తోంది. ఆసియా పెద్దన్ననంటూ చుట్టూ ఉన్న దేశాలపై సవాళ్లు విసురుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని అంతమొందించి... తన ప్రపంచ పెద్దన్న పాత్రలో ఇమిడిపోవాలని దాహం చైనాలో ఎక్కువవుతోంది.
వాయిస్
అమెరికా అధ్యక్షుడిగా నేలబారు నాయకుడి పీఠం అధిరోహించడంతో... ప్రపంచదేశాలపై పైచేయి సాధించాలని రష్యా, చైనా తహతహలాడుతున్నాయ్. ట్రంప్ వ్యవహారశైలితో ప్రపంచదేశాల్లో అమెరికా చులకనైతే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని... మరోసారి నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకోవాలని రష్యా భావిస్తోంది. అదే సమయంలో చైనా కూడా ట్రంప్ తన కొంపను కొల్లేరు చేసుకుంటారని... అది తమకు అడ్వాంటేజ్ గా మారుతుందని చైనా ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలు ఒకరిపై ఒకరు కొట్లాడుకోవడం, ఐరోపా దేశాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతునన్న నేపథ్యంలో... పరిస్థితులన్నీ తమకే అనుకూలమవుతాయని ఆదేశం కలలుగంటోంది.  అందుకే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ తో ప్రపంచ మొత్తాన్ని చేరుకోవాలని డ్రాగన్ పావులు కదుపుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపే. నాణానికి రెండో వైపు కూడా చాలా సినిమా ఉందన్న విషయాన్ని చైనా మీడియా, చైనా పాలకులు మరిచిపోతున్నారు.
వాయిస్
గడిచిన పదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారత్... ఆసియాతోపాటు, ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రపంచాన్ని చుట్టే వన్ బెల్ట్ వన్ రోడ్... బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు అస్సలు మద్దతివ్వకుండా భారత్ చైనాను దూరం పెట్టింది. వన్ బెల్ట్ వన్ రోడ్డుతో ఆసియా దేశాలను ఆర్థికంగా చిదిమేయాలన్న డ్రాగన్ పన్నాగాన్ని భారత్ నిలువరించింది. చైనా ప్రాజెక్టుకు ఏ దశలోనూ మద్దతు చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందివస్తున్న అవకాశాలను అదిమిపట్టుకొని, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ... సరళీకరణ ఆర్థిక విధానాలతో భారత్ దూసుకుపోతున్న పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోంది. భారత్‌ ఆర్థిక ఎదుగుదలను సహించలేని చైనా... సందర్భం వచ్చిన ప్రతీసారి భారత్ కు ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. పాకిస్తాన్ భారత్ పై ఇష్టానుసారం వ్యవహిరించేందుకు, తీవ్రవాదాన్ని ఎగదోసేందుకు నిధులు, ఆయుధాలను అందిస్తోంది. అదే సమయంలో అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌ చేరికను ప్రతిఘటిస్తోంది. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ తో సరిహద్దుల్లో అలజడిన రేపుతూ... భారత్ ను అస్థికపర్చాలని ప్రయతిస్తోంది. ఆ క్రమంలోనే సిక్కిం భూభాగ సరిహద్దుల్లో ఉన్న డొక్లామ్ పై చైనా కన్నుుపడింది. యుద్ధరంగంలోకి దూకి చైనాతో ప్రత్యక్షయుద్ధం చేయాలని కొందరు, భారత్‌లోకి దిగుమతి కాకుండా చైనా వస్తువులపై పూర్తి నిషేధం విధించాలని ఇంకొందరు సూచిస్తున్నారు.
వాయిస్
ఇటీవల సనాతన హిందూవాదులు చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే భారత్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరుదేశాల సభ్య దేశాలుగా భాగస్వాములైనందున... ఏ దేశమూ మరోదానిపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అయ్యేపనికాదు. డోక్‌లామ్‌లో భూటాన్‌, చైనాల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన విషయంలో... థింపూ నాయకత్వం తరఫున భారత్‌ జోక్యం చేసుకుంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం జాగురకతో వ్యవహిరంచాలి.  బీజింగ్‌ బెదిరింపులకు, హెచ్చరికలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచబోమన్న స్పష్టతనూ భారత్ నాయకత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు దౌత్యపరమైన పరిష్కారాలు విషయంలో భారత్ కీలకంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా భారత్‌ ఇప్పుడున్న దానికంటే బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా రూపాంతరం చెందాలి.  భవిష్యత్తులో మనవైపు చూడాలంటేనే చైనా వంటి దేశాలు బెంబేలెత్తిపోయేలా భారత్‌ రాటుతేలాలి. ఒకవేళ చైనా యుద్ధానికే తెగబడితే, దానివల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పొరుగుదేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే దేశంగా చైనాకు చెడ్డపేరు ఉంది. భారత్‌తో సమరానికి దిగితే బీజింగ్‌ ప్రతిష్ట పాతాళానికు చేరుకుంటుంది.
వాయిస్
ఏదిఏమైనా అణ్వస్త్ర బలానికీ భారత్‌ మరింత పదునుపెట్టాలి. చైనా వెనక్కి తగ్గితే ఆ ప్రభావం పాకిస్తాన్ పైనా ఎక్కువగా ఉంటుంది. భారత్ చైనాను కట్టడి చేయగలిగితే... పాక్ భూతం కోరలు పీకినట్టే. భారత అమ్ములపొదిలోని అగ్ని-4ను ఈశాన్య రాష్ట్రాలనుంచి ప్రయోగిస్తే బీజింగ్‌, షాంఘైల దాకా చేరుతుంది. అగ్ని-5 ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే అయిదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను సైతం ఛేదించవచ్చు. అణ్వస్త్ర సంపన్నమైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే... పరిణామాలను ఎవరూ ఊహించలేరు.

స్టోరీ 3
చైనా విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా ముప్పును ముందుగానే పసిగట్టినప్పటికీ... చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో భారత్ ఉంది. డోక్లామ్ విషయంలో ఇప్పటికిప్పుడు తేలేది కాకపోవడంతో చైనా మీడియా భారత్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు లంఖిస్తోంది. భారత్ ను నిలువరించేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేయాలన్న ఉద్దేశంలో డ్రాగన్ భూతం కన్పిస్తోంది. ఒక అబద్ధాన్ని పది సార్లు చెబితే నిజమైపోతుందన్న దీమాతో డ్రాగన్ కుట్రలు పన్నుతోంది.
వాయిస్
చైనాలో గురువారం నుంచి జరగనున్న బ్రిక్స్ దేశాల సమావేశాలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. బ్రిక్స్ దేశాల భద్రత-సవాళ్ల అంశంపై బీజింగ్ లో కీలక సమావేశం ఈనెల 27, 28 తేదీల్లో జరగనుంది. అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారుతో చర్చల విషయంలోనూ క్లారిటీ కన్పించడం లేదు. డోక్లామ్ విషయంలో వాదించడానికి చైనా వద్ద ఏమీ లేదు. డోక్లామ్ ఏరియా నుంచి చైనా బలగాలు ఉపసంహరించుకునేవారకు, అక్కడ్నుంచి కదిలేది లేదని భారత్ తెగేసి చెప్పడంతో ఇరు వర్గాల చర్చలు పాజిటివ్ వాతావరణంలో జరగడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. భారత్ పై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్న చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బ్రిక్స్ సదస్సులో దోవల్, చైనా అధికారులతో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అయిపోదంటూ చెప్పడం ద్వారా భారత్ ను మరింత ఎగదోస్తోంది.
వాయిస్
మరోవైపు రెండు పక్షాల సైనికులు డోక్లామ్ నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే డోక్లామ్ సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాన్ని సుష్మ వ్యక్తం చేశారు. అయితే చైనా మాత్రం తమ బలగాలు డోక్లామ్ నుంచి కదిలేదే లేదని చెబుతోంది. అదే సమయంలో భారత్ మాత్రం డోక్లామ్ నుంచి తప్పుకోవాల్సిందేనంటూ  చైనా రక్షణ శాఖ తేల్చిచెబుతోంది. అదే సమయంలో భారత్‌ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్‌ హెచ్చరించారు. పర్వతాన్ని కదిలించడం తేలికేమోగానీ, పీపుల్ లిబరేషన్‌ ఆర్మీని కదిలించడం మాత్రం చాలా కష్టమంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. భూటానా భూభాగాన్ని తమ భూభాగంగా చెబుతూ...  భారత సైన్యం తమ దేశానికి చెందిన భూభాగం డాంగ్‌లాంగ్‌ను దాటిందంటూ దురుసు వ్యాఖ్యలు చేస్తోంది.
వాయిస్
అదే సమయంలో ఇరు దేశాల మధ్య సందిగ్దతను తొలగించేందుకు అమెరికా ముందుకొస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో చైనా ఓవరాక్షన్ అంతకంతకూ పెరుగుతోంది. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్‌ చెప్పారు. ఈ వివాదంలో అమెరికా ఎవరికి మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు నేరుగా సమస్య పరిష్కరించుకోవాలనే కోరుతున్నామని, ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని రాస్‌ పేర్కొన్నారు.
వాయిస్
మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై బ్రిక్స్ సదస్సులో క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. వ్యూహాలను అమలు చేయడంలో దిట్టయిన అజిత్ దోవల్ చైనాను డోక్లామ్ విషయంలో కట్టిడి చేస్తారని భారత్ భావిస్తోంది. చైనాకు ఎంత మాత్రం సంబంధంలేని భూభాగంలో కాలుదువ్వుతున్న వైనాన్ని విడమర్చి చెప్పాలన్న ప్రణాళికను భారత్ రూపొందిస్తోంది. మరోవైపు దోవల్‌ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకుడు మా జిలాయ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్జియామెన్‌లో నగరంలో జరిగే బ్రిక్స్‌ అధినేతలు సదస్సుకు సన్నాహకంగా ఎన్‌ఎస్‌ఏ అధినేతల భేటీ నిర్వహిస్తున్నారు.

ఎండ్ యాంకర్
తప్పు చేస్తున్నామన్న  విషయం చైనాకు చాలా బాగా తెలుసు. అయితే డోక్లామ్ పీఠభూమిపై ఉన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మలచుకొని భారత్ ను ఆసియా ఖండంలో నిలువరించాలన్న దుష్టపన్నాగంతో సాగిస్తున్న కుట్రలకు మోదీ సర్కారు బదులివ్వాలి. ముల్లను ముల్లుతోనే తీయాలన్న డ్రాగన్ కుట్రలను అదే రీతిలో తీయాలి. చైనా విషయంలో మోదీ సర్కారు నిద్ర లేవాలి. డ్రాగన్ ను చీల్చి చెండాడాలి. ప్రత్యక్ష యుద్ధమంటూ కాలుదువ్వుతున్న చైనా రాజేస్తున్న డోక్లామ్ కల్లోలాన్ని తుదముట్టించే ప్రణాళికతో అడుగులు వేయాలి. తప్పు చేస్తున్న చైనాను ప్రపంచవేదికలపై వేలెత్తి చూపించాలి. అందుకు బ్రిక్స్ దేశాల సహాయాన్ని తీసుకోవాలి. గురువారం జరగనున్న సదస్సులో చైనా దుర్నీతిని సభ్య దేశాల కల్లకు కట్టాలి. చైనాను ఏకాకిని చేసే ప్రణాళిక దైత్యపరంగా అమలు చేయాలి. చైనా సైతం భారత్ పై విద్వేషాన్ని అంతకంతకూ పెంచుతున్న కపట నాటకానికి తెరదించాలి. ఇదీ ఇవాళ్టి ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం... నమస్కారం...  

No comments:

Post a Comment