Friday, 14 July 2017

హైదరాబాద్ ల్యాండ్ స్కామ్ ఓవరాల్


హైదరాబాద్ ఇప్పుడు భూబాకాసురల కబంధహస్తాల్లో చిక్కుకొంది. ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగుచూస్తున్న భూదందాలు ఇప్పుడు భాగ్యనగర భవిష్యత్ ను ప్రశ్నిస్తున్నాయ్. దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భూమాఫియా కోరల్లో చిక్కుకొని విలవిలాడుతోంది. మియాపూర్ భూస్కామ్ తో ఒక్కసారిగా వెలుగుచూసిన ఈ భూస్కామ్ ల పరంపరం ఒకటి  తర్వాత ఒకటి వెలుగులోకి వస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టాక ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న భూకంపాలు... ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయ్.  ప్రభుత్వ పెద్దల అండదండలతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సాగించిన మియాపూర్ భూవిలయం... ఇప్పుడు మరెన్నో కోరలు చాచి... ప్రభుత్వ యంత్రాంగాలను ప్రశ్నిస్తోంది. తాజాగా దీపక్ రెడ్డి భూకబ్జాలు ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాలను కళ్లకుకడుతున్నాయ్. సామాన్యుడు వేల కోట్ల రూపాయల అఫిడవిట్లు సమర్పిస్తే... మన యంత్రాంగాలు ఏళ్ల తరబడి మొద్దు నిద్ర వహించాయ్. ఇక టీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కుటుంబ సభ్యుల భూకొనుగోల్లు.... స్కామ్ తీవ్రతను కళ్లకు కడుతున్నాయ్. ఇక తాజాగా రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ భూదాహం విచ్చలవిడి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఒకరేమో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల అల్లుడు. మరొకరు టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2. ఇంకొకరు.... రాజకీయంగా అపరచాణిక్యుడు. అయితే... నగరంలోని భూదందాలపై సర్కారు ఉక్కుపాదం మోపాతున్నామంటోంది. రిజిస్ట్రేషన్లు రద్దు చేశామంటోంది. పాపమంతా అధికారులదేనంటోంది. నిప్పులేనిది పోగరాదు... అందుకే విపక్షాలు మొత్తం భూమాఫియాపై సీబీఐ విచారణ కోరుతున్నాయ్. నగరంలో జరుగుతున్న భూస్కామ్ లపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్...
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. పెద్దల సభకు ఎన్నికైన పెద్ద మనిషి.  పెద్ద మనిషి తరహాగా ఉండి వ్యవహారాలు నడపాల్సిన నాయకుడు కబ్జాకోరయ్యాడు. వేల కోట్ల రూపాయల స్థలాలను అప్పనంగా కొట్టేయడంలో అరితేరిపోయాడు. ఒకటా రెండా ఏకంగా డజను కేసుల్లో దోషిగా ఉన్నాడు.  చట్టంలో ఉన్న లొసుగులతో వేల కోట్ల రూపాయల భూములను భోంచేస్తున్నాడు. భూమిపై ఆయన కన్నుపడిందో ఇక అంతే సంగతులు. రాజధానిలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇష్టానుసారంగా దీపక్ భూములను భొంచేశాడు.  దీపక్ రెడ్డి భూబాగోతం వివరాలను ఓ సారి చూద్దాం.
దీపక్ రెడ్డి ఒకటీ ఆరా భూములను కాజేయడు. ఏదైనా ఆయనకు గ్రాండ్ గా కన్పించాలి. భూములను భోంచేసేందుకు ఆయన కడుపు మాత్రం పేద్దగా మారిపోతుంది. ఒకటా... రెండో ఏకంగా వందల ఏకరాలను కబ్జా చేసి భోంచేస్తాడు. దారిలోకి వస్తే అధికారులకు పదో పరకో ఇస్తాడు. లేదంటా ఆయన బ్యాగ్రౌండ్ చెప్పేస్తాడు. జేసీ గారి కుటుంబానికి వారసుడ్నంటాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పరపతి ఉందంటాడు. అనుకూలంగా ఉంటే ఓకే... లేకుండా డబుల్ ఓకే అంటాడు. భూమి లిటిగేషన్లో ఉంటే చాలు మానోడు వాలిపోతాడు. రెండు వర్గాలుగా చీలిపోయి భూమి మాదంటే మాదంటూ ఇద్దరితో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో పిటిషన్ వేయిస్తాడు. ఎవరికో ఒకరికి భూమి ధారదత్తం అయిపోతుందన్న సింపుల్ గేమ్ ప్లాన్ దీపక్ రెడ్డిది. ఆ తర్వాత కొన్నాళ్లకు భూమిని తనపై రాయించేసుకుంటాడు. ఇదీ దీపక్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ స్టైల్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పెద్దల సభకు ఎన్నికన జేసీ వారి అల్లుడు దీపక్... చేసేవన్నీ కూడా గబ్బు పనులే. దీపక్ రెడ్డి అక్రమాల క్రమాన్ని ఓ సారి చూద్దాం... బంజారాహిల్స్ లో భూమిని కొట్టేసేందుకు ఎలా గేమ్ ఆడాడో మీరూ చూడండి.  హైదరాబాద్ లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన బంజారాహిల్స్ లోని 3.37 ఎకరాల భూమిని, 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అయితే, 2008లో ఆ భూమిని అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖాజా మొహినుద్దీన్ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని దీపక్ రెడ్డి తరపు న్యాయవాది శైలేష్ సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని వారి నుంచి దీపక్ రెడ్డి కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలను తయారు చేశారు. తమ భూమిని ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో న్యాయవాది శైలేష్ ఫిర్యాదు చేశాడు. మొత్తం పరిణామాలు తెలుసుకున్న అసలు భూమి వారసులు... కేసు పూర్వాపరాలు తెలుసుకొని మేల్కొనేసరికి యవ్వారం చాలా దూరం వెళ్లిపోతుంది. స్థలాన్ని కొట్టేయాలని దీపక్ అండ్ కో ట్రై చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న  చౌదరి తరఫు ప్రతినిధి, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను ఆ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చౌదరి తరపు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. న్యాయవాది శైలేష్ సహా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదీ బంజారాహిల్స్ కేసుకు సంబంధించి కేసు. ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న దీపక్ రెడ్డి...  చౌదరి బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారిని బెదిరించడం, పోలీసుల విచారణలో దురుసుగా వ్యవహరించడం వంటి కేసులు దీపక్ రెడ్డి పై గతంలో నమోదయ్యాయి.
ఇక ఆసిఫ్ నగర్ లో రూ.165 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా కొట్టేసేందుకు న్యాయవాది శైలేష్ పథకం పన్నగా... దీపక్ రెడ్డి ఆర్థిక  సహకారం అందిస్తూ... స్క్రీన్ ప్లే... డైరెక్షన్ చేశారు. అసిఫ్ నగర్ లో ఓ సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సుమారు ఏడేళ్ల క్రితం శైలేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాల భూమిని నిజాం నవాబ్ తమకు ఇనాంగా ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని పత్రాలను శైలేష్ కోర్టుకు సమర్పించేశారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు శైలేష్ వి కావని పోలీసుల ప్రాథమిక ఆధారాల్లో తేలింది. శైలేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పారిపోయాడు. అనుకూలంగా ఉంటే ఒకలా... వ్యతిరేకంగా ఉంటే మరోలా కార్యాచరణను ముందుగానే పకడ్బంధీగా అమలు చేసే దీపక్...  శైలేష్ ను సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. శైలేష్ ను తప్పించేందుకు అల్లిన కట్టుకథగా చివరకు పోలీసులు విచారణలో తేలుతుంది. అలాగే, మెహదీపట్నం బోజగుట్టలోని భూ వివాదంలో గతంలో దీపక్‌ రెడ్డిపై ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీపక్‌ రెడ్డి, శైలేంద్ర సక్సేనా మరో ముగ్గురు కలిసి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లోని విలువైన భూములపై కన్నేశారు. గుడిమల్కాపూర్‌ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 78 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు శైలేంద్ర సక్సేనా సారథ్యంలో మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. నిజాం నవాబుల నుంచి బహుమతిగా పొందిన భూములవి. నగరం విస్తరిస్తుండడంతో వాటి విలువ కూడా భారీగా పెరిగింది. ఆ భూముల హక్కుదారులు పాకిస్థాన్‌లో ఉన్నారు. నకిలీ పేర్లు, వ్యక్తులు, చిరునామాలతో నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి న్యాయస్థానం ద్వారా ఆ భూములను కొట్టేయాలని దీపక్ రెడ్డి అండ్ పావులు కదిపుతుంది. ఈనాం భూములు తమవేనంటూ రెండు వర్గాలు వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించేలా చక్రం తిప్పాడు. న్యాయస్థానానికి సమర్పించిన డాక్యుమెంట్లు పాతవని నమ్మించేందుకు రసాయనాలను ఉపయోగించారు. ఆ భూముల వివరాలను గుర్తించాలంటూ న్యాయస్థానం రెవెన్యూ శాఖను ఆదేశించడంతో అసలు డొంక కదిలింది. వాళ్లు సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీ, ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లని రెవెన్యూ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే రెవిన్యూ అధికారులు ఆసిఫ్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు -2లో సుమారు 2.40 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కాజే సేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కేసుల్లో ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డిని ఐదో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీసీఎస్‌ పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందన కరవైంది. మరో కీలక నిందితుడు శైలేంద్ర సక్సేనా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండు నెలల కిందట పాతబస్తీలోని శైలేంద్ర ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. వీరి కదలికలపై నిఘా ఉంచిన సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు మంగళవారం రాత్రి దీపక్‌ రెడ్డి, శేలైంద్ర, శ్రీనివా‌స్ లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.
దొంగ ఎంత గ్రేట్ గా స్కెచ్ వేసినా ఎక్కడో చోట దొరికిపోతాడు. అవును ఇక్కడ కూడా దీపక్ రెడ్డి అలాగే దొరికిపోయాడు. ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. అఫిడవిడ్ లో ఒకలా... విచారణలో మరోలా చెప్పడం కూడా దీపక్ రెడ్డి మొత్తం కేసులో దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి టీడీపీ తరఫున దీపక్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జేసీ సోదరులైన ప్రభాకర్ రెడ్డికి... దీపక్ రెడ్డి స్వయంగా అల్లుడు. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన అధికారికి సైతం దీపక్ రెడ్డి సమీప బంధువు.  2012 ఎన్నికల్లో దీపక్‌ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు దాదాపు రూ.7000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.  భూ కబ్జాల కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కావడం వెనుక పోలీసులు చాలా పకడ్బందీగానే వ్యవహరించారు. ఏ భూ కబ్జాల కేసుల విషయమై పోలీసులు నోటీసులు పంపించారో ఆ నోటీసులతో తనకు సంబంధం లేదంటూ దీపక్ రెడ్డి వ్యవహరించినట్టు పోలీసులు నిర్ధారించారు.  అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పోలీసులకు కీలకమైన ఆధారంగా మారింది. హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయాల విలువైన భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న దీపక్ రెడ్డి తన చేయితో తన కన్నునే పొడుచుకొన్నాడు. ఈ మేరకు పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఆయనను బుక్ చేశారు. నకిలీ పత్రాలను సృష్టించడమే కాకుండా , ఆ పత్రాల సహయంతో విలువైన భూములను కబ్జా చేయడం, వాటిపై హక్కులను దక్కించుకొని ఎక్కువ రేటుకు విక్రయించేవాడు దీపక్ రెడ్డి. బినామీ వ్యక్తుల సహాయంతో వేలాది ఎకరాల భూమిని దీపక్ రెడ్డి సొంతం చేసుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.  ఈ విషయమై దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి సంబంధించిన సమగ్రంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. నోటీసులిస్తే సంబంధంలేదంటూ తప్పించుకొనే ప్రయత్నం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై భూ కబ్జాల కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఆయనకు మూడు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారంటూ పోలీసులు వద్ద బుకాయించాడు.  అయితే ఈ కేసుల విషయంలో ఆయన కోర్టు నుండి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పై కూడా పోలీసులు కన్నేశారు. ఎన్నికల అఫిడవిట్ లో దీపక్ రెడ్డి ప్రస్తావించిన స్థిర, చర ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ఆధారాలు దొరుకుతాయని పోలీసులు భావించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దీపక్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ను తీసుకొన్నారు. ఏ స్థలాలలకు సంబంధించి కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో...  ఆ వివరాలన్నీ అఫిడవిట్లో ఉన్నాయి. దీపక్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో... బోగస్ డాక్యుమెంట్ల నెంబర్లను కూడా ఇచ్చారని పోలీసులు నిర్ధారించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకొన్నారు.
2012 నాటికే దీపక్ రెడ్డిపై పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం, భూకబ్జాలకు సంబంధించినవి  ఈ కేసులు.ఈ ఏడాది మార్చిలో ఒక ఫోర్జరీ కేసు కూడా ఆయన మీద నమోదయ్యాయి.  అలాగే, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో 3.37 ఎకరాలను ఆక్రమించినట్లు దీపక్‌ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే, 2012లోనే ఆయన 6200 ఎకరాలకు సంబంధించిన 11 సివిల్‌ వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు. దీపక్ రెడ్డి గ్యాంగ్ పై మరో కేసు నమోదు బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీపక్ రెడ్డి గ్యాంగ్ పై ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లను సృష్టించి తన పేరుపై మార్చుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ స్థలం బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనాలు నకిలీ సర్టిపికెట్లు సృష్టించారు. బాలయ్య అనే వ్యక్తి రాధాకృష్ణ ఠాకూర్ కు 16.4.1987 లో భూములను విక్రయించినట్టు డ్యాక్యుమెంట్లను సృష్టించారు. మావూరి శివభూషణాన్ని రాధాకృష్ణ ఠాకూర్ గా మార్చాడు. 8.11.2006 లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్ రెడ్డి పేరుత్ సేల్ కమ్ జీపీఏ చేశారు. కొన్ని మార్పుల కోసం 2008 మార్చిలో దీపక్ రెడ్డి పేరుతోనే మరో ర్యాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ పత్రాలపై న్యాయవాది సక్సేనా సాక్షి సంతకం చేశారు. ఈ పత్రాలను చూపి ఓ బ్యాంకు నుండి రూ.6 కోట్లను లోన్ గా తీసుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు.  శైలేష్ సక్సేనాకు 2011 లో ఆయుధ లైసెన్స్ మంజూరైంది. ఆయన రెండు ఆయుధాలను కొనుగోలు చేశారు. నేరచరితులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయకూడదన్న నిబంధన మేరకు...  శైలేష్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేయాలని సిఫారస్ చేస్తూ మొఘల్ పురా ఉన్నతాధికారులు పోలీసులకు లేఖ పంపారు.
దీపక్ రెడ్డికి తనను పోలీసులు అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలియదా... ఒకవేళ విచారణ చేసినా... తన మార్క్ ట్రిక్స్ తో పోలీసులు కన్నుగప్పొచ్చనుకున్నారా? ఏపీ ప్రభుత్వం తనను కాచుకుంటుందనుకున్నారా... అయితే మొత్తం వ్యవహారంలో అంతా తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకానీ, పోలీసులు గానీ ష్... గప్ చుప్ లా ఎందుకుండిపోయారు? దీపక్ రెడ్డిని అరెస్టు చేయాలంటే బలమైన ఆధారాలు కావాలి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో పోలీసుల కన్నుగప్పి తప్పించుకుంటున్న దీపక్ విషయంలో పోలీసులు ఎంతో పకడ్బంధీ వ్యూహాన్ని అమలు చేశారు. మొత్తం వ్యవహారంలో ఏపీ ఎలా రియాక్ట్ అవుతుందో పరిశీలిస్తూ ముందడుగేశారు. దీపక్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు సేకరించారు.  ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందించడంతో కేసు విచారణ ముందుకు సాగింది.  హైదరాబాద్ సెంట్రల్ క్రెం స్టేషన్ అభ్యర్థన మేరకు దీపక్ రెడ్డి గురించి సమగ్ర సమాచారాన్ని ఆంధ్ర అధికారులు అందించినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ గురించి తెలంగాణా ప్రభుత్వం ఆంధ్ర అధికారుల సహాయంతో కూపీలాగుతున్నపుడు అది ప్రభుత్వపెద్దలకు కచ్చితంగా  తెలిసే అవకాశం ఉంది. అయితే దీపక్ రెడ్డి అరెస్టు అయ్యే వరకు ఎక్కడా కూడా ఈ విషయం ఎక్కడా లీక్ కాలేదంటే... దీపక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోవాలనుకొంది. ఇప్పటికే  దివాకర్ ట్రావెల్స్ పై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అనవసరమైన తలనొప్పి ఎందుకన్న భావనలోకి వెళ్లింది.   మరోవైపు ఓటుకు నోటు కేసు వ్యవహారం కూడా ఉండటంతో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.
ఇండియాలో బహుశా ఏ రాజకీయ నాయకుడూ... పేర్కొనంతా అస్తుల విలువ ఎన్నికల అఫిడవిట్ లో దీపక్ రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం ఉపఎన్నికల సందర్భంగా దీపక్  రెడ్డి సుమారు రూ. 7 వేల కోట్ల ఆస్తుల లెక్కను విప్పాడు. 2009-10 అసెస్మెంట్ ఇయర్ లో  ఆదాయం కేవలం రు. 3.27 లక్షలుగా చూపించారు. ఆయన భార్య ఆదాయం కూడా... రూ. 1.98 లక్షలు మాత్రమే. దీపక్ రెడ్డి అరెస్టుకు అంధ్రా అధికారులు సహకరించడం, ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా దాచడం వెనక  బలమయిన రాజకీయ కారణాలున్నాయంటున్నారు. దీపక్ రెడ్డి బాగా రాజకీయ, డబ్బు ప్రాబల్యం ఉన్ననేత.  రాయదుర్గం నేమకల్ దగ్గిర మైనింగ్, క్రషింగ్ వ్యాపారాలు ఉన్నాయి. జేసీ బ్రదర్స్ అల్లుడు. అంతా బాగానే ఉన్నప్పటికీ... రాయదుర్గంలో స్థానికంగా ఉన్న నాయకత్వ సమస్యల విషయంలో కూడా... దీపక్ అరెస్టు విషయాన్ని ఏపీ పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉంది. కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి చాలా ఇష్టుడయిన నాయకుడు.  కాలవ శ్రీనివాసులు స్థానాన్ని డబ్బుతో అస్థిరపరిచేందుకు దీపక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడన్న అనుమానాలు పార్టీ వర్గాలు ఉన్నాయ్. ఇప్పటికే జిల్లాలో రెడ్డి సమాజికవర్గం నుంచి పల్లె రఘునాథరెడ్డిని తప్పించి కాలువకు సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవి కట్టబెట్టారు.
కొసమెరుపేంటంటే... భూ కబ్జా కేసులో తనను కుట్ర పూరితంగా ఇరికించారని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ పై వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొస్తున్నాడు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కీలక నేత కె కేశవరావు కుటుంబ సభ్యులకు సంబంధించి మరో భూలావాదేవీ ఇప్పుడు సంచలనమవుతోంది. వందల కోట్ల రూపాయాల విలువైన భూములను కేకే కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్టర్ కావడం... దాని వెనుక గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తమున్నట్టుగా వార్తలు వస్తున్నాయ్. అయితే కేకే మాత్రం తాను అన్నీ నిర్ధారించుకున్నాకే భూములు కొనుగోలు చేశానంటున్నారు.
మరో  భూ స్కాం వెలుగులోకి వచ్చింది... ఈసారి అధికార పార్టీ సీనియర్ నాయకుడు కె.కెశవరావు భూ వివాదంలో చుక్కుకున్నారు. ప్రభుత్వ భూములను కె.కె తన కుటుంబ సభ్యుల పేర్లపై  రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చర్చనీయంశమవుతోంది.  కె.కె కుటుంబ సభ్యులకు ఇబ్రహీంపట్నంలోని దుండుమైలారం లో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు పొక్కింది. అయితే కేశవరావు మాత్రం ఇది ప్రభుత్వ భూమి కాదరని కోర్టు, కలెక్టర్ ఆదేశాల మేరకే భూములు కొనుగొలు చేశానంటూ దబాయిస్తున్నాడు. భూముల కొనుగోలుకు సంబందించి డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు.  మియాపూర్ భూ స్కాం నిందితులతో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. రాజధానిలో ఎక్కడెక్కడ  భూములు కబ్జా అయ్యేయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ స్టోన్ పార్థసారధి నోరు విప్పడంతో కె.కె కుటుంబం భూ స్కాం బయటపడింది. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో ప్రభుత్వ భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీ దొంగ పత్రాలతో చేసిన బాగోతం బయటకు పొక్కింది. సర్వే నెంబర్ 36లోని 50 ఎకరాల భూమిని గోల్ట్ స్టోన్ కంపెనీ జీపీఏ చేసుకొంది. గోల్డ్ స్టోన్ ప్రతినిధులు 50 ఎకరాలలో 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కేశవరావు తన కుమారై గద్వాల విజయలక్ష్మీ, కొడలు జ్యోత్స్న, కంచర్ల నవజ్యోతిల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. దీని దర్యాప్తు చేపట్టిన అధికారులు కేశవరావు కుటుంబ సభ్యులకు రిజిస్టేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సాలేహా ఖాదీర్ ను సస్పెండ్ చేయడంతో అసలు కథ బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా గోల్డ్ స్టోన్ భూబాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్.  ఇబ్రహీంపట్నం దండుమైలారం హఫీజ్ పూర్ లో 2244 ఎకరాల అసైండ్ భూమి ఉంది.  అప్పటి ప్రభుత్వం 1965 లో ప్రభుత్వం 422 ఎకరాల భూమిని పట్టాలతో ప్రజలకు పంచి ఇచ్చింది. ఆ తరువాత గోల్డ్ స్టోన్ కంపెనీ దీని పై కన్నేసింది. సర్వే నెంబర్ 36 యొక్క భూమిని వివరాలను సేకరించింది. ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీ అక్రమంగా జీపీఏను చేసుకొంది.
50 ఎకరాల భూమిని 36 ఎకరాలను కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ, కోడలు జ్యోత్స్న, కంచర్ల నవజ్యోతి,  గోల్డ్ స్టోన్ కంపెనీ ప్రతినిధులు 2015లో రిజిస్టేషన్ చేయాల్సిందిగా దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొత్తం వ్యవహారం తెలిసిన నాటి సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఈ దరఖాస్తును పక్కనబెట్టారు. భూలావాదేవీలో అవకతవకలు ఉన్నాయన్న అనుమానంతో పెండింగ్ లో పెట్టారు. ఆ భూమిపై కన్నేసిన బడాబాబులు... ఆ తర్వాత భూమిని తమ పరం చేసుకునే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేశారు. ఆయనపై బదిలీ వేటేసి... సీనియర్ అసిస్టెంట్ సాలేహా ఖదీర్ ద్వారా...  పెండిగ్ లో ఉన్న వ్యవహారాన్ని చక్కబెట్టేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఖదీర్ అక్రమంగా రిజిస్టేషన్ చేశాడని గుర్తించి ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. అంతా తెలిసిన కేశవరావు మాత్రం తాము అంతా రూల్స్ ప్రకారమే వ్యవహరించాంటూ భూకొనుగోలును వెనకేసుకొస్తున్నారు. మొత్తం వ్యవహారమంతా ఇంతలా బట్టబయలైనా... కేశవరావు మాత్రం తమ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కొనుగోలు చేయలేదని...   హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించాకే కొనుగోలు చేశామంటూ చెబుతున్నారు. కోర్టు అదేశాల మేరకే ఈ భూమిని రిజిస్టేషన్ చేయించుకున్నామంటున్నారు. అయితే కేశవరావుకు భూములను జీపీఏ చేసిన గోల్డ్ స్టోన్ కంపెనీకి, కేశవరావుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఎంతో చర్చ నడుస్తోంది. రాజకీయంగా కేశవరావు ఎదుగుదలకు గోల్డ్ స్టోన్ పాత్ర చాలా పెద్దదేనని వారి గురించి తెలిసినవారు చెప్తారు.
అధికారం మీ కేరాఫ్ అడ్రస్ అయితే వారు మీకు వొంగి వొంగి సలామ్ చేస్తారు. చట్టం వీరికి ఇష్టమొచ్చినట్టుగా ఫ్లెక్సీగా మారుతోంది. సామాన్యులకు చట్టం చట్టంలానే పనిచేస్తోంది... అయితే అసామాన్యులకు  మాత్రం చుట్టమైపోతోంది. అధికార పార్టీ నేత డి శ్రీనివాస్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ భూముల పేరుతో ఎవ్వరికీ కూడా రిజిస్టర్ చేయని భూములు మన ఘనత వహించిన నాయకుడికి మాత్రం దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు.   తెలంగాణలో భూకంప తీవ్రత సునామీలా మారుతోంది. ఏవైపు నుంచి ఏ సంక్షోభం వస్తుందో అర్థం కాక అధికార పార్టీకి వణుకిపోతోంది. ఇప్పటికే మియాపూర్ స్కామ్ ఆ తర్వాత కేకే భూముల వ్యవహారంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టగా... తాజాగా రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ భూమాయ ఇప్పుడు సంచలనం రెకెత్తిస్తోంది. డీఎస్ పేరు ఎప్పుడు ఎన్నికల సీట్లు కేటాయింపు సమయంలోనే బయటకు వచ్చేది. రెండుసార్లు పీసీసీ చీఫ్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి... గులాబీ పార్టీలో చక్రం తిప్పుతూ భూస్కామ్ లో చిక్కుకున్నారు.
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని డీఎస్ కొనుగోలు చేశారు. గతంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించినా... అవి ప్రభుత్వ భూములని చెప్పిన అధికారులు... డీఎస్ కొనుగోలు చేసేసరికి... ఎస్ చెప్పేశారు.  మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలోని గౌడవెల్లి - రాయిలాపూర్ రోడ్డులో సర్వే నెంబరు 221లో 8.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ... గిర్మాపూర్ గ్రామంలోని భూమిని  నిరుపేదలకు పంచిపెట్టారు. అయితే ఈ భూమిని 1972-73లలో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. మూడేళ్ల తర్వాత యాదిరెడ్డి నుంచి... ఆ భూములను సోదరుడు రాజిరెడ్డి కొనుగోలు చేశాడు.  ఆయన మృతి చెందిన తర్వాత ఆ భూములు సాయిరెడ్డి.. బల్వంత్ రెడ్డి.. రఘుపతిరెడ్డి పేర్ల మీద తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా దఖలుపడే ఆస్తి హక్కుగా 'విరాసత్' చేశారు. అయితే గిర్మాపూర్ భూములు అసైన్డ్ భూములు కావడంతో వాటిని అనుభవించవచ్చుగానీ... అమ్మడానికి మాత్రం అవకాశం ఉండదు. అసైన్డ్ భూమి మీద హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. ఇతరులకు అమ్మే హక్కు ఉండదు. అందుకే భూములను కొనుగోలు చేసినప్పటికీ అవి కాగితాలపైనే ఉంటాయి కానీ రికార్డుల్లో మాత్రం ఉండవు.  అసైన్డ్ దారుల నుంచి చేతులు మారిన భూమిని వెనక్కి తీసుకునేందుకు అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ తలనొప్పి మాకెందుకనుకున్న వారసులు... ఆ భూమిని అమ్మేస్తే పోలా అనుకొని... రాజ్యసభ సభ్యుడు డీఎస్... ఆయన అనుచరుడు ఎ.వి. సత్యనారాయణ రావుకు 2015లో అమ్మేశారు.
వారసులకు భూమి కేటాయించినప్పుడే... ఆ తరహా విధానం చెల్లదంటూ తేల్చిచెప్పిన రిజిస్ట్రేషన్ అధికారులు... డీఎస్ కు మాత్రం భూములను కట్టబెట్టేశారు. ఆయన ప్రభుత్వంలో పెద్ద మనిషి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు కావడంతో... రిజిస్ట్రేషన్ చకచకా చేసేశారు. డీఎస్ పేరిట నాలుగు ఎకరాలు.. ఎ.వి. సత్యనారాయణ పేరిట రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ ను మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తతంగాన్ని పూర్తి చేశారు.  అనంతరం ఈ ఏడాది జనవరిలో...  భూములు మావేనన్నట్టుగా అధికారం కట్టబెట్టే... 'మ్యుటేషన్' కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేయటానికి ససేమిరా అన్నారు. చేతులు మారిన అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకునేందుకు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది. డీఎస్ నాడు ఎకరాన్ని రూ. 14 లక్షలకు కొనుగోలు చేయగా... ఇప్పుడా భూమి... కోటి రూపాయల వరకు పలుకుతోంది. ప్రభుత్వ భూములు పక్కదారి పట్టే అవకాశం లేదంటూ సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొడుతున్నప్పటికీ... ఇక్కడ ఎవరి ఇష్టానుసారం వారు... తమ పనులను చక్కబెట్టేసుకుంటున్నారు.
రాజధానిలో రోజుకో భూస్కామ్ జరుగుతుంటే... విచారణపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు...  వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్కామ్ బయటకు వస్తున్నా... ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేయడం... అరెస్టులతో మొత్తం వ్యవహారాన్ని సరిపెట్టుస్తున్నారా? సీఐడీతోగానీ, సీబీఐతోగానీ విచారించాలన్న విమర్శలకు సర్కారు ఎందుకు ముందుకు రావడం లేదు.  మియాపూర్ భూకుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్ పరిధిలో ఇంతటి స్కామ్ చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదు అంటూ అందరూ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం... కుంభకోణాన్ని కనుక్కున్నదే మేమంటూ సమాధానమిస్తోంది. అయితే విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి కదా... విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయ్. ఇప్పటికే మియాపూర్ స్కామ్ కు సంబంధించి ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాయ్.  స్పాట్
నగరంలో జరుగుతున్న భూకుంభకోణాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండటం వల్లే మొత్తం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ్ చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే మియాపూర్ భూములను సందర్శించి దోషులను శిక్షించాలంటూ ఫిర్యాదులు సైతం చేశారు.
మియాపూర్ భూకుంభకోణం వెలుగుచూసి మూడు వారాలు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు దానిపై స్పందించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. ప్రభుత్వంలో పెద్దలెవరి అండదండలు లేకుండా ఇంత పెద్ద భూకుంభకోణం జరపడం సాధ్యం కాదని...  ఆ పార్టీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి స్పస్ష్టం చేస్తున్నారు.  సీఎం కేసీఆర్ పేషీలో పనిచేస్తున్న ఒకవ్యక్తి ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సమీప బంధువని... వారే తెర వెనుక ఉండి ఈ కధ అంతా నడిపించారని విమర్శించారు.  ఎంసెట్ లీకేజ్ కేసును, తరువాత నయీం కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ అటకెక్కించేశారు. ఇప్పుడు మియాపూర్ కేసూ కూడా అంటూ వారు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారులపై సస్పెన్షన్‌తో ఏమీ కాదని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్‌ చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు.  దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
భూకుంభకోణాలతో వేల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే... ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని... టీజీఏసీ కన్వీనర్ కోదండరామ్ దుయ్యబట్టారు.
అధికార పార్టీ నేతల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు గద్దల్లా తన్నుకుపోతున్నా పాలకులు ఉదాసీనంగా ఉండటాన్ని టీజేఏసీ మండిపడుతోంది. కబ్జాకోరులు రాబందుల్లా సర్కారు భూములపై వాలిపోతున్నా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టీ జేఏసీ నేతలు నిర్ణయించారు. మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం మౌనం వహించడంతో  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయ్.  అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి... సమస్య లేకపోయినప్పటికీ... జనంలో మాత్రం అనుమానాలు మొదలయ్యాయ్. అద్భుతంగా పనిచేస్తున్నామంటూ టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ...  అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయ్. మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువవుతోంది.
మరోవైపు  ప్రభుత్వం మాత్రం... మొత్తం భూ లావాదేవీలు ఏవీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పద్ధతి ప్రకారం జరగలేదని స్పష్టం చేస్తోంది. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో జాగీరు భూములపై హక్కులు సంపాదించడానికి కొంతమంది చేసిన ప్రయత్నం వల్ల ఎక్కడా ఖజానాకు రూపాయి కూడా నష్టం కలగలేదని, గజం భూమి అన్యాక్రాంతం కాలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని... సీబీఐ విచారణ ఎంత మాత్రం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు జరిగే విధానంలోనే లోపముందని, ఈ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మియాపూర్‌, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో తప్పుడు భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామంటూ...  ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.  ఇటీవల జరిగిన పరిణామాలను ఒక అవకాశంగా తీసుకుని రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అధికారులను ఆదేశించినట్టుగా ప్రకటనలో తెలిపింది. జాగీర్ భూములపై హక్కు పత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సుప్రీంకోర్టులో వీటికి సంబంధించిన కేసులు నడుస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలని సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్ లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు... ట్రాన్సఫర్ ఆఫ్ ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ కాదని... లిటిగేషన్ రైట్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమేనని ప్రభుత్వం వివరించింది.  ఒక వేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషనే అయితే, మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జి రూ. 415 కోట్లు చెల్లించాల్సి ఉండేదని... ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.60 లక్షలు మాత్రమే ఫీజుగా వసూలు చేశారని... ఎంతో కొంత కట్టాలి అన్నట్లు కట్టారు తప్ప...  ఈ చార్జి  ప్రాతిపదికన కాదని ప్రభుత్వం నిర్ధారించింది.  ఇక ఈ  భూమిని  స్థిరాస్తి...  ఇమ్మూవబుల్ ప్రాపర్జీగా  రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని... అంటే భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్ 1లో చేయాల్సి ఉన్నా...  చరాస్తిగా... మూవబుల్ ప్రాపర్టీగా  బుక్ 4లో రిజిష్టర్ చేశారని అందువల్లే ఈ రిజిస్ట్రేషన్ కు ఏమాత్రం విలువలేదని ప్రభుత్వం చెప్పింది. సివిల్ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో వాదనకు బలం చేకూరడానికి ఈ హక్కు పత్రాలు సంపాదించడానికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిని, బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మియాపూర్ తో పాటు మరో ఏడు గ్రామాల భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేసిన వ్యవహారం కూడా ఇలాగే ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ కూడా భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ జరగలేదని... భూమిపై లిటిగేషన్ హక్కులకు రిజిస్ట్రేషన్ జరిగింది. కేవలం రూ.8లక్షలు తీసుకుని మొక్కుబడి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయ్. మియాపూర్ తరహాలోనే ఇక్కడ కూడా వ్యవహరించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మియాపూర్, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు రాయలేదు. ఎన్ని ఎకరాలో రాయలేదు. పైగా ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదని.... ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగలేదని.... ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొంది. పై రెండు ప్రాంతాల్లోనే కాకుండా, మిగతా చోట్ల జరిగిన వ్యవహారంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.  జాగీరు భూములు రద్దయిప్పటికీ... ఇంకా వాటిపై హక్కులున్నాయని పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. జాగీరు భూములు రద్దయ్యాయని, వాటిపై ప్రభుత్వానికే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ వ్యవహారంలో కుంభకోణం ఏమీలేదని, ఎక్కడా ప్రభుత్వానికి నష్టం కలగలేదని ప్రభుత్వం నిర్ధారించుకున్నది. అయితే ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంతమంది అవకతవకలకు పాల్పడినట్లు కూడా వివరించింది.
హైదరాబాద్ లో బయటపడుతున్న భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా బెంబేలెత్తిస్తున్నాయ్.  మొన్న మియాపూర్ ల్యాండ్ స్కామ్, ఆ తర్వాత దీపక్ రెడ్డి వ్యవహారం, నిన్న కేకే భూముల కొనుగోలు వ్యవహారం... తాజాగా రాజ్యసభ్యుడు డీఎస్ అసైన్డ్ భూముల కొనుగోలు  ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూస్కాములు బయటపడుతూనే ఉన్నాయ్. పవర్ ముందు సాగలబడే అధికారులతో ప్రభుత్వ పెద్దలు తమ పనులు కానీచ్చేస్తున్నారు.  కాసులిస్తే... ఏదైనా జరిగిపోతుందన్న అభిప్రాయం కలిగించేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏం జరగలేదంటూ... కేవలం అధికారుల తప్పుతోనే ఇవి జరిగాయంటూ సర్దిచెప్పే  ప్రయత్నం చేస్తోంది. అంటే ప్రభుత్వ పెద్దలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదన్న అభిప్రాయాన్ని సర్కారు వ్యక్తం చేస్తోంది. అయితే ఎకౌంటబులిటీ ఉండాల్సిన నేతలు... ఇష్టానుసారం వ్యవహరిస్తే... అది మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం భూమాయలవుతాయ్. మేడ్చల్ దందాలూ అవుతాయ్. అధికారుల కనుసన్నల్లో... పాలకులను అంటకాగుతూ జరుగుతున్న స్కామ్ లకు ఫుల్ స్టాప్ పడకుంటే కేసీఆర్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

No comments:

Post a Comment