Thursday, 25 May 2017

ఏపీలో బీజేపీ డబుల్ గేమ్


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం వైసీపీ ప్రతిపక్షంలోకి కూర్చోవడం చకచకా జరిగిపోయాయ్. ఏపీలో అధికారాన్ని అందుకోవాలని ఆరాటపడిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల పోరులో చతికిలపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని, పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికలు పూర్తై దాదాపు మూడేళ్లు పూర్తి కావొస్తున్నా... టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అంతగా బలపడినట్టుగా కన్పించడం లేదు.  కేంద్ర మంత్రి వెంకయ్య,చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే... వైసీపీ అధినేత జగన్ సైతం బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం అటు జగన్ తోనూ, ఇటు చంద్రబాబుతోనూ అవసరం మేరకు మాత్రమే స్పందిస్తున్నట్టుగా కన్పిస్తోంది.  అయితే చంద్రబాబుపై పూర్తిగా నమ్మకం లేకనే బీజేపీ జగన్ వైపు కూడా బీజేపీ పెద్దలు చూస్తున్నారా? అందుకే రెండు పార్టీలతో కమలం పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందా?


బీజేపీ నేతలకు ఏపీ విషయంలో క్లారిటీ వచ్చేసిందా..  తెలంగాణపై పట్టు కోసం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగితే... ఏపీ విషయంలో మాత్రం పెద్దగా దృష్టి సారించినట్టుగా కన్పించడం లేదు. టీడీపీతో పొత్తే బీజేపీ ఆచితూచి వ్యవహరించడానికి కారణమా?
వరుస ఎన్నికల్లో విజయం తర్వాత...  బీజేపీ ఫుల్ జోష్ లో కన్పిస్తోంది.  తిరుగులేని నాయకుడిగా మోదీ ప్రభ పతాకస్థాయిలో దూసుకుపోతుండంతో ఆ పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కన్పిస్తోంది. అయితే... దేశ వ్యాప్తంగా దూసుకుపోతున్న బీజేపీకి ఏపీ విషయంలో  క్లారిటీ మిస్సవుతోంది. టీడీపీతో పొత్తు ఉండటం ఆ పార్టీ ముందడుగేయలేని పరిస్థితిలోకి నెట్టబడుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తుందన్న సంకేతాలను పార్టీ నేతలు ఇస్తున్నప్పటికీ... రెండు పార్టీల్లో ఏదో అనుమానం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని...   గో ఎలోన్... గ్రో ఎలోన్ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నట్టు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. సో ఇప్పుడు విషయంలో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తక్కువనే చెప్పాలి. అందుకే ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వేచి చూసే ధోరణిలో ఉంది.  టీడీపీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ నేతల్లో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయ్. కొంత మంది టీడీపీతో కలిసే ఉందామని ప్రతిపాదిస్తుండగా... మరికొంత మంది టీడీపీతో పొత్తుతో బీజేపీకి ఒరిగేదేమీ లేదని... బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలంటే అది టీడీపీ పొత్తుతో సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1999 నుంచి బీజేపీతో పొత్తు ఉన్న సందర్భాల్లోనే టీడీపీకి గెలుపు సాధ్యమైందని... ఒంటరిగా వెళ్లినప్పుడు టీడీపీ ఎప్పుడూ కూడా గెలవలేదన్న విశ్లేషణను కొంత మంది ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎక్కున స్థానాలను డిమాండ్ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.


బీజేపీ డిమాండ్లకు టీడీపీ తలొగ్గుతుందా... గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించిన టీడీపీ... ఈసారి బీజేపీ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది. ఏ మేరకు సీట్లను కేటాయిస్తుంది. ఎమ్మెల్యేలు కాకుండా బీజేపీ ఈసారి టీడీపీని ఎంపీ స్థానాలు విషయంలో గట్టి పట్టబడుతుందా? ఏ రాష్ట్రంలోనైనా తమ ముద్ర తప్పనిసరన్నట్టుగా బీజేపీ ఢిల్లీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఎక్కడిక్కడ కంట్రోల్ చేస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ... దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడాన్ని అంగీకరించే ప్రసక్తి కన్పించడం లేదు. నయోనా... భయనో బీజేపీకి సాహో అనాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఆయా పార్టీలకు కలుగుతోంది. ఇటీవల పరిమామాలు చూసినప్పుడు మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బెంగాల్ విషయంలోగానీ, హిమాచల్ ప్రదేశ్ విషయంలోగానీ, తమిళనాడు విషయంలోగానీ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి రావాలని తలపోస్తున్న బీజేపీ ఏపీ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితిలో ఉంది.
టీడీపీతో డైరెక్ట్ గా యుద్ధానికి ఆ పార్టీ సిద్ధం కాకపోవచ్చు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సయోధ్య కొనసాగుతున్న తరుణంలో టీడీపీని ఇరుకునపెట్టేలా బయటకు వ్యవహరించకపోయినా... తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరూపించుకోవాలని ఢిల్లీ పెద్దలకు తెలుసు. అందుకు కావాల్సిన కార్యాచరణను వారు సిద్ధం చేసుకుంటున్నారు.  ఏపీలో వీలైనన్ని అసెంబ్లీ సీట్లను అడగడంతోపాటు, మెజార్టీ ఎంపీ స్థానాలను కోరాలన్నది ఆ పార్టీ ఆలోచన.  అయితే టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో పెద్దగా సానుకూలంగా రియాక్ట్ కాకపోయినప్పటికీ... ఎంపీల విషయంలో బీజేపీ అభిప్రాయాన్ని గౌరవించక తప్పని సరి పరిస్థితి టీడీపీకి ఉంటుంది.
తెలంగాణలో స్వయంగా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న బీజేపీ... ఏపీ విషయంలో 50-50 అన్న భావనలోనూ ఉన్నట్టు టీడీపీతో అంతగా సఖ్యత కోరుకొని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుందన్నది కూడా  ఆ పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీతో టీడీపీ కలిసి పనిచేయాల్సిన నేపథ్యంలో ఆ పార్టీ విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పని పరిస్థితి ఉంటుందని కొంత మంది నేతలు చెబుతున్నారు. బలమైన వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీని తట్టుకొని గెలవాలంటూ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎంతో అవసరం. ఇది బీజేపీ కంటే టీడీపీకే బాగా  తెలుసు. అందుకే ఆ పార్టీ బీజేపీ విషయంలో క్లారిటీతో ఉంది. పొత్తు తప్పనిసరి పరిస్థితుల్లో కుదుర్చుకోవాలన్నది ఆ పార్టీ స్టాండ్. బీజేపీకి కూడా ఈ విషయంలో స్పష్టతతో ఉంది. టీడీపీ నుంచి వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ, ఎంపీ స్థానాలను దక్కించుకోవాలన్నది. తేడా వస్తే... ఉండనే ఉంది కదా.... వైసీపీ...

అవును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీకి సెకండ్ ఒపీనియన్ ఉంది. టీడీపీ నుంచి జగన్ విషయంలో ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ... బీజేపీ తన పంథాను అదే విధంగా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి శత్రువంటే మనకు మిత్రుడే కదా... ఇదే లాజిక్కు జగన్ విషయంలో బీజేపీ మెతకవైఖరి అవలంబించడానికి కారణమా... లేక చంద్రబాబును కంట్రోల్ లో పెట్టాలంటే జగన్ కావాలనా... ?
కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోగా... వైసీపీ టీడీపీకి గట్టి ఫైట్ ఇచ్చింది. బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ కలిస్తే గానీ వైసీపీని ఓడించలేని పరిస్థితి. ఇదే విషయాన్ని బీజేపీలోని కొంత మంది నేతలు అనేకసార్లు చెప్తూ వస్తున్నారు.  గతంలో ఢిల్లీలో చక్రం  తిప్పిన ఏపీ సీఎం చంద్రబాబు... మరోసారి కీలక పాత్ర పోషించే పరిస్థితి రాకూడదన్నది బీజేపీ అంతరంగం. బయటకు ఈ వైఖరిని పార్టీ నేతలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ... బాబు బలపడితే ఇబ్బందన్న భావన ఆ పార్టీ పెద్దల్లో ఉంది. అందుకే టచ్ మీ నాట్ గా టీడీపీతో ఢిల్లీ పెద్దలు ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఇదే వైసీపీ అధినేత జగన్ కు కలిసొచ్చే అంశం. ఆస్తుల కేసులో 16 నెలల పాటు జైళ్లో ఉండొచ్చిన జగన్... బీజేపీతో ఎలాంటి వైఖరి అవలంబించాలో తెలియనివారేం కాదు. కాంగ్రెస్ పార్టీకి తాను పూర్తిగా దూరంగా ఉన్నానని... అవసరమైనప్పుడు తన మద్దతు మీకేనంటూ మోదీ అండ్ కోకు జగన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికే మద్దతిస్తానంటూ చెప్పడం కూడా జగన్ కు ఢిల్లీ పాలిట్రిక్ లో మరోసారి యాక్టివ్ రోల్ లభించినట్టైయింది. తనను విమర్శించేవారితో మాట్లాడే బదులు... తనకు మద్దతిచ్చేవారి సపోర్ట్ తీసుకోవాలన్న భావనలో ఉన్న మోదీకి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి మద్దతు కూడా కొన్ని విషయాల్లో  అవసరమవుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న జగన్ కు ఇది అడ్వాంటేజస్ సిట్యూవేషన్ ను ఇస్తోంది.
అదే సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న జగన్ విషయంలో ప్రజల్లో ఉన్న అంచనాలు కూడా బీజేపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటోంది. ఏపీలో ఉన్న పరిస్థితులను బీజేపీ హైకమాండ్ నిశతంగా గమనిస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు... రెండు గ్రూపుల నుంచి సమాచారాన్ని సేకరించి... ఫైనల్ డిసిషన్ మాత్రం మోదీ, షా ద్వయం తీసుకుంటోంది.  మరోవైపు చంద్రబాబు సర్కారును  విమర్శించడంలోనూ, రాజధాని భూముల స్కాములు, అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలోనూ జగన్ అనుసరిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి ఆదరణ లభించడానికి కారణమవుతోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఖుషీఖుషీగా ఉన్నారన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వివరిస్తున్నారు.  అయితే బాబు కాదంటే జగన్ ఇదే బీజేపీ లాజిక్కు...  

జగన్ పార్టీ ఏపీలో ఎంత వరకు బలపడుతోంది. గతంలో చేసిన తప్పును మరోసారి జగన్ రిపీట్ చేస్తున్నారా... లేక టీడీపీని ఓడించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా?
జగన్ పార్టీ ఏపీ పాలిట్రిక్స్ లో ప్రస్తుతమున్న పొజిషనేంటి? దేశంలోనే బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ... ఏపీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికారపక్షం ముందు నిలబడే సామర్థ్యంలోని  పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకొని... మంత్రులు కూడా అయిపోయిన పరిస్థితి. జగన్ వైఖరిపైనా ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ... వారంతా టీడీపీలోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబుకు ఎదురెళ్లి మరో కొంతకాలం వెయిట్ చేయగలమా... లేదా అన్న అంశం కూడా ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా కన్పిస్తోంది. మరోవైపు జగన్ పై ఉన్న ఆస్తుల కేసుల విషయంలోనూ కొంత మందిలో భిన్నాభిప్రాయాలున్నాయ్. ఇది కూడా పార్టీలో స్టబ్బర్న్ గా ఉంటున్న నేతలను ఆలోచనలో పడేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో అన్నిపార్టీల నేతలకు కేసీఆర్ గేట్లు బార్లా తెరిస్తే... ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది.  జగన్ కు పూర్తి స్థాయిలో మొదట్నుంచి మద్దతిస్తున్న చిత్తూరు, కడప జిల్లా నేతల బలం కొండంత అండగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, శివప్రసాద్రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా తదితర నేతల ఇటు ఇంటా బయట పార్టీకి ఎంతో దన్నుగా నిలుస్తున్నారు. అసెంబ్లీలోనూ పార్టీ అధినేత స్వరాన్ని గట్టిగా విన్పిస్తూ... ప్రభుత్వంపై సమరం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ జగన్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో జరుగుతున్న అక్రమాలపైనా జగన్ మీడియా సాక్షి పతాకస్థాయిలో కథనాలు అందించింది. రైతుల సర్కారు మోసం చేస్తోందని... భూసేకరణపైనా జగన్ పోరాటం సాగిస్తున్నారు. పలు ఆందోళనల్లో విపక్షాన్ని సైతం కలుపుకొని వెళ్తున్నారు.
చంద్రబాబును ఎదుర్కోవడంలో జగన్ సమర్థవంతంగా పనిచేస్తున్నారన్న భావనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఉన్నారు. అయితే  జగన్ కేసుల విషయంలో ఎలాంటి వార్తలు వస్తాయన్న బెంగ ఆ పార్టీ నేతల్లో కన్పిస్తోంది.

జగన్ పార్టీ ఒక్కటే ఏపీలో టీడీపీ ని ఓడించే పరిస్థితి ఉందా...? జగన్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయాలా? పవన్ కల్యాణ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఏపీలో ఉన్న ఆరు పార్టీలు రెండు వైపులా బరిలోకి దిగుతాయా? మొన్నటి వరకు జగన్ తో కలిసి పనిచేస్తున్న లెఫ్ట్ పార్టీలో జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుతో ఏవిధంగా వ్యవహరిస్తుంది? ఏపీలో ముక్కోణపు పోటీ తప్పదా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో టాక్ట్ ఫుల్ గా పనిచేస్తున్న పరిస్థితి... అటు బీజేపీతో సఖ్యతగానే ఉంటూనే... బీజేపీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్న విషయంపై ఓ కన్నేసి పాలన సాగిస్తున్నారు. ఏపీకి కేంద్రం సపోర్ట్ ఉంటేనే మనుగడన్న భావనలో మాట్లాడిన సీఎం చంద్రబాబు... ప్రత్యేక హోదా బదులు... ప్రత్యేక సాయానికి కూడా ఓకే చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సి ఉన్నప్పటికీ... ప్రాజక్టును టేకప్ చేస్తూ... వచ్చే ఎన్నికల సమయానికి నిర్మాణం పూర్తి చేస్తే... తనకు తిరుగుండదని బాబు భావిస్తున్నారు. అయితే బాబు ఆలోచనలు నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు బీజేపీ చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఏమేరకు అందిస్తుందన్నది అనుమానమే... బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశాయనుకుందాం... అప్పుడు మిగతా పార్టీలు ఎటువైపు?
పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయ్. బయటకు చెప్పలేకపోయినా... పవన్ తమతో ఉంటే మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. కాపుల్లో నెలకొన్న అసంతృప్తి... ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందన్న భావనలో పలువురు నేతలు ఉన్నారు.  ఇప్పటికే ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు. పవన్ మాత్రం... బీజేపీనిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ... నేరుగా ఎక్కడా కూడా టీడీపీపై మాత్రం వ్యాఖ్యలు చేయడం లేదు. బాబు సర్కారును విమర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదు. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్న సమయంలో పవన్ టీడీపీతో రాజీపడతారా... కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తానంటున్న పవన్ పాత్ర ఏపీ పాలిటిక్స్ లో ఎలా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది.
అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకలైన్లో ఉంటే... వైసీపీ, లెఫ్ట్ పార్టీలు మరోవైపు ఉండగ తప్పనిసరి పరిస్థితి. అదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు జగన్ పార్టీ సైతం సిద్ధంగా ఉందన్న అభిప్రాయం ఉంది. యూపీ ఫలితాల తర్వాత మైనార్టీలు, ఎస్సీ ఓట్లన్న భావన కంటే... తనకు ఏది ఉపయోగపడుతుందన్న భావనలో జగన్ ఉన్నారు.
అటు లెఫ్ట్ పార్టీలైనా, జగన్ పార్టీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా కంపల్షన్ లో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకరితో ఒకరు జట్టు కట్టాల్సిందే... ఇందుకోసం కొన్ని విషయాల్లో ఆయా పార్టీల రాజకీపడాల్సిందే... ఇక జనసేన పరిస్థితి గందరగోళంగా ఉంది.
అన్నీ బేరీజు వేసుకున్న జగన్...  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామని... ఎన్నికల్లో విపక్షాలు అభ్యర్థిని సైతం నిలబెట్టాల్సిన అవసరం లేదన్నది కుండబద్ధలు కొట్టారు. ఇదే విషయాన్ని జగన్... ప్రధాని మోదీని కలిసిన తర్వాత చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ నేతలు ఈ పరిణామాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కేసులకు సంబంధించి మోదీని కలిశారు తప్పించి మరోటి కాదంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం... మోదీని... జగన్ కలిస్తే టీడీపీకి ఉలుకెందుకంటూ అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు.
మరోవైపు మోదీతో జగన్ భేటీపై టీడీపీ నేతల విమర్శలను బీజేపీ కీలక నేత సోము వీర్రాజు ఒక్కరే గట్టిగా దుయ్యబడుతున్నారు. ప్రధాని మోదీ దేశం మొత్తానికి ప్రధాని అని... మోదీని కలిస్తే పెడ అర్థాలు  ఎందుకు తీస్తారంటూ ఆయన మండిపడుతున్నారు.  వచ్చే రోజుల్లో  బీజేపీ-వైసీపీల మధ్య బంధానికి చిహ్నంగా కొంత మంది వైసైపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  

       ఏపీలో బీజేపీని కాదని... చంద్రబాబు ఎన్నికల్లో ఒంటరి పోరు చేయగలరా...  మరోసారి ఏపీలో విజయం సాధింగచగలరా...  ఏపీలో తన తప్ప ఎవరూ కూడా పాలన ప్రజలకు సజావుగా సాగించలేరన్న దీమాతో ఉన్న బాబుకు జనంలో అదే రకమైన ఆదరణ కన్పిస్తోందా? ఏపీలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి ఉందా?  ప్రజలకు చేయాల్సిందంతా చేస్తున్నానన్న బాబును జనం ఎంత వరకు నమ్మగలరు... అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబుకు మరోసారి కలిసివస్తోందా?
కేంద్రం సహకరించినా... సహకరించకపోయినా... ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటున్నామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఏపీలో బీజేపీని కాదని... ఒంటరి పోరు సాగించడం కష్టమేనా ? బాబు ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి బీజేపీతో పొత్తుతోనే సాధ్యమైందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే టీడీపీలో ఉన్న పలువురు నేతలు బీజేపీతో పొత్తు తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు... ఆ విషయం తెలియని కొంత మంది టీడీపీ నేతలు మాత్రం... బీజేపీతో పొత్తు వద్దని అంటున్నారు.
అయితే ఏపీ రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు... బీజేపీ విషయంలో ఎలాంటి విముఖతను బయటకు వ్యక్తం చేయకుండానే... తన పని తాను చేసుకుపోతున్నారు. బీజేపీ ఇచ్చినవన్నీ తీసుకుంటూ... ఏపీ హక్కుల కోసం పోరాడతానంటూ చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక సాయంగానీ, పోలవరం ప్రాజెక్టు రావడంగానీ అన్నీ తనతోనే సాధ్యమయ్యాయని బాబు చెప్తున్నారు. రాజధాని భూసేకరణ ఎలాంటి వివాదం కాకుండా చేయగలిగామని... ప్రపంచశ్రేణి రాజధాని నిర్మాణం చేస్తున్నామని... చెప్తున్నా... కొన్ని చోట్ల రాజధాని భూముల రైతుల్లో ఎన్నో అనుమానాలున్నాయ్. అయితే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంతో సత్తా చాటానన్న భావనలో చంద్రబాబు ఉన్నారు.
అయితే నోటుకు ఓటు కేసుతోనే చంద్రబాబు... బీజేపీతో అమీతుమీ తేల్చుకోలేకపోతున్నారని... రాజీ ధోరణి అవలంబిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు వింటున్నారని... సొంత నిర్ణయాలు... సొంత ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని... లోకేశ్ ను తెరపైకి తీసుకురావడానికి కారణం కూడా ఇదేనన్న అభిప్రాయం ఉంది. వచ్చే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తన రాజకీయ వారసుడికి పగ్గాలు కట్టబెట్టేందుకు బాబు సిద్ధమవుతున్నారు.

        బీజేపీ ఏపీ విషయంలో అనుసరిస్తున్న పంథా ఏంటి? ఏం చేస్తే బీజేపీకి ఎక్కువ లాభం కలుగుతుంది? టీడీపీతో పొత్తు కొనసాగితే టీడీపీకి ఎక్కువ లాభమా? బీజేపీకి ఎక్కువ లాభమా..?
అటు జగన్ తోనూ, ఇటు చంద్రబాబుతోనూ ఇద్దరితోనూ ఒకే డిస్టాన్స్ బీజేపీ మెయింటేన్ చేస్తోందా... రాష్ట్రపతి ఎన్నికల్లో జై కొట్టిన జగన్ కు ఏపీలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..?
ఏపీలో అనుకున్న స్థానాల్లో విజయం సాధించాలన్నా... టీడీపీ మద్దతు లేదా... మరో పార్టీతో సఖ్యతగానైనా ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితన్న భావన బీజేపీలో ఉంది. అయితే పెద్ద ఎత్తున పార్టీకి నేతలు వలసలు వచ్చినా... బలమైన నేతలు పార్టీలోకి వస్తే తమ అదృష్టం మారుతుందన్న అభిప్రాయం పార్టీ హైకమాండ్ లో ఉంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎదగాలన్నది ఆ పార్టీ నేతల క్లియర్ అండర్ స్టాండింగ్.  అయితే పార్టీలో ఉన్న నేతలే  ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి నాయకత్వంపై అసహనంగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయినా మరో నేతలను ఇప్పటి వరకు  ఎంపిక చేయని పరిస్థితి. వీటన్నింటికీ కుల, ప్రాంతాల సమతూల్యతతోపాటు, టీడీపీని పరిగణలోకి తీసుకోవాల్సిరావడమేనన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు విన్పిస్తున్నారు.
బీజేపీని దోషిగా నిలబెట్టాలనేలా ఏపీలో పాలిట్రిక్స్ నడుస్తున్నాయ్. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ... ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్న అభిప్రాయం అటు టీడీపీ, వైసీపీ నేతల్లో ప్రబలంగా ఉంది. అయితే గట్టిగా బీజేపీని ప్రశ్నించే ధైర్యం రెండు పార్టీలకు లేదు. అదే సమయంలో ఏపీకి చెప్పినదానికంటే ఎక్కువ చేస్తున్నామని బీజేపీ చెప్పుకుంటోంది.  14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నది బీజేపీ భావన.
అందుకే బీజేపీ ఏపీకి చేయాల్సిన సాయం విషయంలో వెనుకడుగేయడం లేదని...  అదే సమయంలో ప్రత్యేక హోదా మాత్రం సాధ్యం కాదన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడికి అప్పజెప్పింది. అదే సమయంలో ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయం చేస్తుందన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రణాళికను ఆ పార్టీ నేతలు విన్పిస్తున్నారు.  అయితే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఆర్థిక సంఘం సిఫారసులు పెద్దగా అడ్డంకి కాదన్నది కాంగ్రెస్ పార్టీ వర్షన్. అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ సీఎం చంద్రబాబును పట్టుకోవడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న బీజేపీ నేతల్లో బలంగా ఉందన్న అభిప్రాయాన్ని కొంత మంది ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఒంటరి పోరంటూ ఆ పార్టీ నేతలు స్పష్టం చేయడంతో... ఏపీలో మాత్రం కలిసే పనిచేస్తామన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం తెలంగాణలో అధికారం చేపట్టడం... ఏపీలో కింగ్ మేకర్ రోల్ పోషించేలా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే... అటు జగన్... ఇటు చంద్రబాబు... నడుమ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా తమదే పై చేయి కావాలన్నది ఆ పార్టీ నేతల భావనగా ఉంది.  

No comments:

Post a Comment